కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించి, తన అందచందాలు మరియు ఆకట్టుకునే నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన త్రిష, ఇటీవల తెలుగులో సినిమాలు చేయడం ఒకింత తగ్గించారు అనే చెప్పాలి. తొలిసారి తరుణ్ హీరోగా వచ్చిన నీమనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష, కొద్దిరోజుల క్రితం వచ్చిన నాయకి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఇక ఇటీవల తమిళనాట విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 అనే లవ్ స్టోరీ తో సూపర్ హిట్ కొట్టిన త్రిష, 

అక్కడ మరొక భారీ అఫర్ ని సంపాదించినట్లు నేడు పలు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, అతి త్వరలో కోలీవుడ్ బడా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న పొన్నియన్ సెల్వం సినిమాలో త్రిషని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, మోహన్ బాబు వంటి భారీ కాస్ట్ ఈ చిత్రంలో భాగమయ్యారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లన్నట్లు సమాచారం. కల్కి కృష్ణ మూర్తి రాసిన చోళుల చారిత్రక నవల ఆధారంగా ఈ మూవీని మణిరత్నం తెరకెక్కించనున్నారు. అయితే త్రిష పాత్ర కోసం గతంలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా చర్చకు వచ్చినప్పటికీ,

మణిరత్నం మాత్రం త్రిషనే తీసుకోవాలని చూస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినపడుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక ఒకవేళ నిజమే అయితే మాత్రం త్రిష రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. ఎందుకంటే ఎందరో నటీనటులు మణిరత్నం సినిమాలో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఆయన కలల ప్రాజక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిషకు ఛాన్స్ రావడం నిజంగా అదృష్టం అనే అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: