మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్తో సాగే ఈ సినిమా బడ్జెట్ ను తగ్గించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక చివరికి ప్లాప్ అనిపించుకోవడం గోపీచంద్ ఇష్టపడట్లేదని.. అందుకే ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని గోపీచంద్ చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో సంపత్ నంది బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు. 'యు టర్న్'లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (ప్రొడక్షన్ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
ఇక గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చేసిన చాణక్య మిశ్రమ స్పందనతో మొదలై బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చేతులెత్తేసింది. గోపీచంద్, మెహ్రీన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఏకే ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే .ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో చాణక్య, కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 'సైరా' పోటీలో ఉండటంతో 'చాణక్య'కు కోలుకోలేని దెబ్బ తగిలింది. చిరంజీవి సినిమా బ్లాక్ టాక్ తెచ్చుకున్నాక ఇక ఇతర హీరోల సినిమాలు పోటీలో నిలబడవు. ఈ విషయం 'చాణక్య' మొదటి రోజు వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది. ఆ తరువాత రోజుల్లో కూడా చాణక్య పెద్దగా కలెక్షన్స్ ను సాధించలేకపోయింది. 6 రోజులకుగాను ఏపీ, తెలంగాణల్లో చాణక్య రూ.3.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొత్తానికి చాణక్య డిస్ట్రిబ్యూటర్లను పూర్తిగా ముంచేశాడు.