దక్షిణాది సినీ పరిశ్రమలో 1980 దశకం నటీనటులకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ దశకంలో వచ్చిన వారు దాదాపు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ లో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి వచ్చిన వారే. వారిలో చాలా మంది స్టార్స్ కూడా అయ్యారు. సినిమాపై ఇష్టంతో ఎన్నో కలలు కంటూ వచ్చిన వారంతా అప్పటికి ఔత్సాహికులు. తమ టాలెంట్ తో కష్టపడి సినీ పరిశ్రమలో నిలదొక్కుకుని ప్రేక్షకాభిమానుల గుండెల్లో నిలిచిపోయారు.

 

వారందరూ ప్రతి ఏటా 1980 రీయూనియన్ పేరుతో తొమ్మిదేళ్లుగా ఏడాదిలో ఓ రోజు కలిసి గత జ్ఞాపకాలను నెమరవేసుకుంటు న్నారు. వీరిలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఉన్నారు. ప్రతి ఏడాది ఓచోటు అనుకుని వారందరూ ఒకే కలర్ డ్రెస్సింగ్ తో తమ జ్ఞాపకాలతో సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. గతేడాది చైనాలో జరిగిన ఈ సందడి ఈ సారి ఓ ప్రత్యేకమైన చోట జరుగనుంది. 1980 రీయూనియన్ పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈసారి ఈ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో జరుపబోతున్నట్టు ఇదివరకే తెలియజేశారు. నవంబర్ 23న ఈ కార్యక్రమం జరుగబోతోందని ఆయన తెలిపారు. స్థాయీ బేధాలు లేకుండా వారు సెలబ్రేట్ చేసుకునే ఈ సందర్భాన్ని గెట్ టుగెదర్ అనే చెప్పాలి.

 

ఈ సెలబ్రేషన్ ను అట్టహాసంగా జరపడానికి చిరంజీవి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, వెంకటేశ్, సురేశ్, నరేశ్, జాకీష్రాఫ్, భానుచందర్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, భాగ్యరాజ్, మోహన్ లాల్, శోభన, సుహాసిని, లిజీ, కుష్బూ, రాధిక, రాధ, సుమలత.. ఇలా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన హేమాహేమీలు ఈసారి హైదరాబాద్ లో మెగాస్టార్ ఇంట సందడి చేయబోతున్నారు. వీరంతా ఈసారి ఏ కలర్ డ్రెస్సింగ్ లో మెరిపిస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: