రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలా అవుతాయో, రామ్ గోపాల్ వర్మ అతను పెట్టే సినిమా టైటిల్, ఇవి రెండు ఏకమైతే సంచలనాలకు సందుదొరికినట్లు సంబరపడతాయి. అసలే వివాదాలకు పెద్దకొడుకులాంటి వర్మ ఏదిచేసిన దానికో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు కూడా తనదైన శైలిలో మరో వివాదానికి తెరతీసాడు. అదేమంటే ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించి టీడీపి నేతల్లో గుబులు పుట్టించాడు వర్మ, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
గత ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనంతపురంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కులాల మధ్య గొడవలు సృష్టించేదిగా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొనడమే కాకుండా ఈ సినిమా టైటిల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే వర్మ సినిమా అంటేనే ప్రభుత్వ అధికారి కాన్వాయ్ మీదున్న ఎర్ర బుగ్గ లాంటిది. ఆ కాన్వాయ్ పరిగెత్తడం మొదలు పెట్టిందా ఎర్రబుగ్గ అరుస్తూనే ఉంటుంది. అలాగే వర్మ ఒక టైటిల్ పెట్టాడా ఆ సినిమా విడుదలైయ్యేవరకు వివాదాలు తేనే తుట్టల్లాగా ముసురు కుంటాయి.
ఇకపోతే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పోస్టర్లతో తనదైన స్టైల్లో వివాదాలు సృష్టించిన వర్మ ఆటం బాంబు లాంటి ట్రైలర్ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశాడు. అంతటితో ఊరుకున్నాడా జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ను పోలిన పాత్రలతో ట్రైలర్ను విడుదల చేశాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అంతే ఇంకేముంది వివాదానికి ఇంటి అడ్రస్గా మారింది..