నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'ఎంతమంచివాడవురా' సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు చిత్ర బృందం. కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాలంలో వరుస చిత్రాలతో నిరుత్సాహపరుస్తున్నాడు. అయినా కూడా సినిమాల విషయంలో మాత్రం స్పీడ్ తగ్గడం లేదు. 

ఒక వైపు 'ఎంత మంచివాడవురా' సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో వైపు కొత్త సినిమాకు కూడా ఓకే చెప్పాడట. మహేష్ కోనేరు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు స్వయంగా వెళ్లడించాడు. 118 సినిమాని నిర్మించిన మహేష్ కోనేరుతో మరో సినిమాను కళ్యాణ్ రామ్ చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 118 మంచి సినిమాగా పేరు సంపాదించుకుంది. కమర్షియల్ గా కూడా పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాలో సరసన నివేదా థామస్, శాలినీ పాండే హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. 

ఇక 118 సినిమాకి ముందు కూడా కళ్యాణ్ రామ్ 'నానువ్వే' చేశాడు ఈ సినిమాకి మహేష్ కోనేరు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవలే మహేష్ కోనేరు తమిళ సినిమాను 'విజిల్' గా డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ ఒకే అనిపించుకుంది. నందమూరి సోదరులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పీఆర్వోగా చేసిన మహేష్ కోనేరు నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక మహేష్ ను మంచి అభిరుచి గల నిర్మాతగా నిలబెట్టేందుకు కళ్యాణ్ రామ్ మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ సారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చేది కొత్త సినిమానా లేక 118 కి సీక్వెలా అన్నది మాత్రం క్లారిటి లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: