తమిళంలో ఒకప్పుడు తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన నటుడు..సెంథిల్ కుమార్ దారుణంగా మోసపోయాడట. యాక్షన్
హీరో అర్జున్ నటించిన జెంటిల్ మెన్ లో అన్నా నువ్ ఎసస్సెసీ ఫెయిల్..నేను సెవెన్త్ పాస్ అంటూ నవ్వించాడు.
రజినీకాంత్ నటించిన నరసింహా మూవీలో పెళ్లిచూపులకు వెళ్లే సీన్ లో కడుపుబ్బా నవ్వించిన సెంథిల్
కుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. అయితే కొంత కాలంగా సెంథిల్ కి ప్రస్తుతం సరైన అవకాశాలు లేవు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో మెరిసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
తాజాగా సెంథిల్ ని మోసం చేసిన ప్రొడక్షన్ మేనేజర్ను
చెన్నై పోలీసులు
అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సాలిగ్రామంలోని
భాస్కర్ కాలనీ 3వ వీధిలో ఉన్న ఓ అపార్ట్ మెంటులో పది ఫ్లాట్ లు వున్న రెండో అంతస్తు మొత్తం సెంథిల్ కుమార్ది. 2013లో
సినిమా ప్రొడక్షన్ మేనేజర్ సగాయరాజ్ ఆ అంతస్తును నెలకు రూ.2.60 లక్షల అద్దెకు తీసుకున్నాడు. గత ఆరేడు నెలల నుంచి ఆయన అద్దె చెల్లించడం లేదట. పైగా
ఫోన్ చేస్తే ఎలాంటి సమాధానం కూడా ఇవ్వడం లేదట..దాంతో అనుమానం వచ్చిన సెంథిల్ అపార్ట్ మెంట్ కి వెళ్లి చూడగా అక్కడ వేరే వ్యక్తులు ఉన్నారట.
అయితే వారిని వివరాలు అడిగితే..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారట. సగాయరాజ్ ఈ అపార్ట్మెంట్ను తమకు లీజుకు ఇచ్చాడని, మరికొందరికి అద్దెకు ఇచ్చాడని చెప్పడంతో సెంథిల్
కుమార్ విస్తుపోయాడు. సగాయరాజ్ తనను మోసం చేశాడంటూ విరుగంబాక్కమ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.