అతి త్వరలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా ఎరుగని దర్శకుడైన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. మరికొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాకు ఆదిలోనే కొద్దిపాటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎప్పుడూ తన సినిమాలకు సంగీత దర్శకుడిగా తీసుకునే దేవిశ్రీ ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో కొరటాల శివ కొంత ఆలోచనలో పడ్డారట. 

వాస్తవానికి దేవికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్న కారణంగా కొరటాల మరియు మెగాస్టార్ సినిమా చేయలేనని చెప్పేశాడట. అయితే అప్పటినుండి వేరొక సంగీత దర్శకుడి కోసం విపరీతంగా వెతుకులాట ప్రారంభించిన కొరటాల, ఇటీవల బాలీవుడ్ లో మంచి సంగీత ద్వయంగా పేరుగాంచిన ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ను సంప్రదించడం జరిగిందట. అయితే వారికి మెగాస్టార్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశ  ఉందని, కానీ ప్రస్తుతం వారు ఎంతో బిజీగా ఉండడం వలన ఆయన సినిమాకు పని చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఇక ఇటీవల మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సంగీతం అందించిన అమిత్ త్రివిది నే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇక మెగాస్టార్ సరసన హీరోయిన్ గా త్రిష లేదా నయనతార నటించే ఛాన్స్ ఉందని, ఈ విషయాలన్నిటి పై సినిమా యూనిట్ నుండి మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను రాబోయే వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: