టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యువ సామ్రాట్ కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన నటి అనుష్క శెట్టి. అయితే నటించిన తొలి సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన సినీ కెరీర్ ని వృద్ధి చేసుకుంటూ ముందుకు సాగింది అనుష్క. ఇక ఆ తరువాత కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఆమె నటించిన అరుంధతి సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు విపరీతమైన పేరు తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి మరింతగా దూసుకెళ్లిన అనుష్క, ఆ తరువాత నుండి తెలుగుతో పాటు తమిళ్ వంటి పలు ఇతర భాషల్లో కూడా భారీ చాన్సులే దక్కించుకుంది. 

కొన్నాళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు భాగాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించి నేషనల్ లెవెల్ లో తన క్రేజ్ ని పెంచుకుంది ఈ భామ. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం అనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది.  ఈ సినిమాలో ఆమె సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడు మాధవన్, హీరోయిన్స్ అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. 

ఇకపోతే నిన్న అనుష్క జన్మదినం సందర్భంగా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ సీన్స్, ఆకట్టుకునే విజువల్స్, అలరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగిన ఈ టీజర్ రిలీజ్ తరువాత సినిమాపై అమాంతం అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ప్రస్తుతం ఈ టీజర్ 12 మిలియన్లు (1 కోటి 20 లక్షలు) కు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: