అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, జాతీయ పురస్కారం అందుకున్న 'నా బంగారు తల్లి' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేష్ టచ్ రివర్‌ సుప్రీం కోర్ట్‌లో విజయం సాధించారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో నిజ జీవిత ఘటనల ఆధారంగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'పట్నఘఢ్'. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.


సుప్రీం కోర్టు బెంచ్ ఈ సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. సినిమాపై పిటిషనర్‌కు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది.ఒరిస్సాలోని పట్నఘఢ్ పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ టచ్ రివర్ ఈ సినిమాను రూపొందించారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఓ నేరస్తుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ... థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా... ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలుగు, ఒరియా భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు ఒరియాలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావటం విశేషం.
`వివాహం జరిగిన ఐదో రోజు కొత్త దంపతులకు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది.‌ అందులో ఏముందో అని తెరిచి చూడగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. పెళ్లి కొడుకుతో పాటు అతడి బామ్మ ఆ బ్లాస్ట్‌లో మరణిస్తుంది. ఈ ఘటనతో పట్నఘఢ్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.


ఈ ఘటనకు కారణమైన హంతకుల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది సినిమా కథ` అని దర్శకుడు రాజేష్ టచ్ రివర్ తెలిపారు.హిందీ సినిమా `102 నాట్ అవుట్` ఫేమ్ జార్జి జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా కోసం ఒక జానపద గీతాన్ని స్వరపరిచారు. ఒక ఒరియా చిత్రానికి ఆయన సంగీతం అందించడం ఇదే తొలిసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: