కేథరిన్‌ ట్రెసా దుబాయ్‌లో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన నటి. తన చదువును బెంగళూర్‌లోనే చదివింది. ఈ బ్యూటీకి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. వయోలిన్‌ వాయించడం, పాటలు పాడడం వంటి కళల్లో నేర్పరి అయిన కేథరిన్‌ ట్రెసా మొదట్లో మోడలింగ్‌ రంగంలో రాణించింది. ఆ తరువాత నటిగా సినీరంగప్రవేశం చేసింది. కానీ ఈ ముద్దు గుమ్మకు ఇప్పుడు సినీ అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. 


2010లో తొలుత కన్నడంలో శంకర్‌ ఐపీఎస్‌ అనే చిత్రంతో నటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తదనంతరం మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను అందుకుంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు సక్సెస్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో మెడ్రాస్‌ చిత్రం ద్వారా కార్తీకి జంటగా దర్శకుడు పా.రంజిత్‌ పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు కేథరిన్‌ట్రెసాకు పేరు తెచ్చి పెట్టింది. 


మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడిని మెడ్రాస్‌ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా చూపించి దర్శకుడు కేథరిన్‌ ట్రెసా రూపురేఖలను మార్చేశారు. ఆ తరువాత ఈ జాణ గ్లామర్‌కు మారిపోయింది. అలా విశాల్, అధర్వ, ఆర్య వంటి యువ స్టార్స్‌తో వరుసగా నటించి గుర్తింపు పొందిన కేథరిన్‌ ట్రెసాకు సడన్‌గా కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అందంతో పాటు మంచి ట్యాలంట్‌ ఉన్న ఈ అమ్మడికి కారణాలేమైనా ఇతర భాషల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి. 


చివరిగా ఈ బ్యూటీ తమిళంలో శింబుకు జంటగా వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం అరువమ్‌ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. అయితే తొలి చిత్రం మెడ్రాస్‌ తరువాత కోలీవుడ్‌లో కేథరిన్‌ ట్రెసాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించలేదనే చెప్పాలి. అన్నీ గ్లామరస్‌ పాత్రలే రావడంతో వాటికే పరిమితం అయిపోయింది. ఇప్పుటికీ అందాలారబోతకు సై అంటోంది. నటిగా దశాబ్దం పూర్తి కావస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకంఅడ్‌ ఇన్నింగ్స్‌ కోసం రెడీ అయ్యింది ఈ భామ. 


మరింత సమాచారం తెలుసుకోండి: