మన్మధుడు 2 నాగార్జున కి భయంకరమైన షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని, మళ్లీ సెట్ మీదకు వెళ్లేందుకు హీరో నాగార్జున రెడీ అవుతున్నారు. వాస్తవానికి స్వంత సినిమా రామరాజు చేయాల్సి వుంది. కానీ అనేక కారణాలతో ఆ సినిమా ఆరు నెలలు వెనక్కు వెళ్ళినట్టు లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం మల్టీస్టారర్ చేయడానికి నాగ చైతన్య అంతగా ఇష్టపడక పోవడం, చైతన్య చేతిలో బోలెడు సినిమాలు వరుసగా వుండడం ఇతర కారణాలు అని కూడా తెలుస్తోంది. 

అదీ కాక నాగ్ స్వంత సినిమా చేయడానికి ముందు ఒకటి రెండు బయట సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఆ తరువాత తన రామరాజు సినిమా అలాగే అఖిల్ తో పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్ లో (అభిమన్యుడు డైరక్టర్) సినిమా తన బ్యానర్ లో నిర్మించాలని అనుకుంటున్నారు. వీటన్నింటికి తోడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు ఆరు నెలలు దూరంగా వుండాలని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ కలిసి మొత్తం మీద నాగ్ రామరాజు సినిమాను వెనక్కు పెట్టి, వేరే సినిమాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారని ఫిల్మ్ నగర్ నుండి అందిన సమాచారం.

మాట్నీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కొత్త దర్శకుడు సొలమన్ తో నాగ్ ఈ సినిమాను చేయబోతున్నారు. మహర్షి సినిమా స్క్రిప్ట్ లో సొలమన్ కూడా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకువచ్చిన సబ్జెక్ట్ తోనే నాగ్ ఈ కొత్త సినిమా చేయబోతున్నారు. అతి కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుందని తాజా సమాచారం. రీసెంట్ గా బిగ్ బాస్ షో నుండి ఫ్రీ అయిన నాగార్జున ఇక సినిమాల మీద దృష్ఠి సారించబోతున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: