నిన్నరాత్రి జరిగిన అక్కినేని నాగేశ్వరావు అవార్డ్ ఫంక్షన్ ను అక్కినేని కుటుంబ సభ్యులు చాల ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నాగార్జున త‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఈ కార్యక్రమాన్ని చాల ఉత్సాహ వంతంగా నడిపించాడు. 

అయితే ఈ కార్యక్రమం మధ్యలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురి కావడమే కాకుండా అతడి మాటలో ఉద్వేగం అదేవిధంగా కళ్ళల్లో కన్నీరు స్పష్టంగా కనిపించింది. ఇక ముఖ్యంగా శ్రీదేవి రేఖల‌కు ఏఎన్నార్ అవార్డు ఇవ్వాల‌ని తన తండ్రి నాగేశ్వరావు అనేక సార్లు తనతో చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నప్పుడు నాగ్ చాల ఎమోషనల్ గా కనిపించాడు.  

ఇది అంతా ఒక ఎత్తు అయితే దివంగ‌త‌ శ్రీదేవి త‌ర‌ఫున అవార్డు స్వీక‌రించిన ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ కూడా ఎమోష‌న‌ల్ అవ్వడమే కాకుండా ఆ అవార్డు తీసుకున్న తరువాత కన్నీటిని ఆపుకోలేక తన ప్రసంగాన్ని కొనసాగించ లేకపోయాడు. దీనితో బోనీ కపూర్ కన్నీటి వ్యధను చూసిన వారికి శ్రీదేవి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి రేఖ గురించి మాట్లాడుతూ ఆమె లాంటి గొప్ప నటితో నటించ లేకపోవడం తన దురదృష్టం అంటూ ఆమెతో నటించ లేకపోయినా ఆమెతో కలిసి రాజ్యసభలో మెంబర్ గా కొనసాగడం తన అదృష్టం అంటూ కామెంట్ చేసాడు. ఇదే కార్యక్రమంలో మరొక ట్విస్ట్ ఇస్తూ చిరంజీవి తాను రేఖను ఇష్టపడితే తనకు సురేఖ భార్యగా దొరికిందని చెపుతూ తన ఇంటిలో తన భార్యను రేఖ అని పిలుస్తూ తన అభిమానాన్ని రేఖ పై ఇప్పటికీ కొనసాగిస్తున్న విషయాన్నీ వివరిస్తున్నప్పుడు రేఖ చిరంజీవిని చూసి ముసిముసి నవ్వులు నవ్వింది. ఆద్యంతం ఆహ్లాదకరంగా నడిచిన ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీకి సంబంధించిన చాలమంది వ్యక్తులు హాజరు అయ్యారు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: