భారతదేశ దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి లాంటి సెన్సషనల్ హిట్ తరువాత తీస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హీరోయిన్ మాత్రం ఇంకా సెట్ కాలేదు. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు తీస్తున్న కొత్త సినిమాలో కథానాయిక కోసం పడుతున్న అవస్థలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా ఖరారైంది. ఆమె ఎగిరి గంతేసి ఈ సినిమా ఒప్పుకుంది. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ అనే బ్రిటిష్ డ్రామా ఆర్టిస్టును ఎంచుకున్నాడు జక్కన్న. కానీ అనివార్య కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇది జరిగి ఆరేడు నెలలవుతోంది.


అయినప్పటికీ ఆమె స్థానంలో ఇప్పటి వరకు కొత్త హీరోయిన్ ను సెట్ చేసింది లేదు. మరో పక్క రిలీజ్ డేట్ కు తన్నుకు వస్తుంది.  ఎన్టీఆర్‌కు జోడీగా నటించాల్సిన పాత్రకు విదేశీయురాలు కావాలి. కానీ ఆ పాత్ర కోసం జక్కన్న ఆశిస్తున్నట్లు అమ్మాయిని సెట్ చేయడానికి చాలా సమయం పట్టేస్తోంది. మరి ఆయన కోరుకున్న అమ్మాయిలు సినిమా చేయడానికి ఒప్పుకోవట్లేదా.. లేక సరైన అమ్మాయి ఎవరూ దొరకట్లేదా అన్నది అర్థం కావడం లేదు. ఓవైపు చకచకా ముఖ్య సన్నివేశాలన్నీ చిత్రీకరించేస్తున్న రాజమౌళి.. ఈ పాత్రకు సంబంధించిన పోర్షన్ మాత్రం పక్కన పెట్టేశారు. 


ఇప్పటికే విడుదల డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితిలో సమ్మర్ కు రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఇంకో ఎనిమిది నెలల్లో సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండగా.. ఇంకా రెండో హీరోయిన్ ఖరారు కాకపోవడం విచిత్రమే. 'బాహుబలి' తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఓవైపు హీరోయిన్ వేట కొనసాగిస్తూ.. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూళ్లను మార్చి అమ్మాయి దొరికాక చివర్లో చిత్రీకరిద్దామని జక్కన్న చూస్తున్నాడట. మరి ఈ వేట ఎప్పటికి పూర్తయ్యేనో?

మరింత సమాచారం తెలుసుకోండి: