మెగాస్టార్ చిరంజీవి జార్జిరెడ్డి సినిమా చిత్ర బృందాన్ని అద్భుతం అంటూ అభినందించారు. సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన అడుగు అడుగు అంటూ జరిగే లిరికల్ వీడియోను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జార్జిరెడ్డి లాంటి సినిమాలు ఎన్నో రావాలని.. ఈతరం యువతకు ఈ సినిమా బాగా నచ్చుతుంది అని అన్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. 1972లో అతను ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు అని, అప్పుడే తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నాడు అని, ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు, 'జార్జిరెడ్డి: మ్యాన్ ఆఫ్ యాక్షన్' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆ పేరు వింటున్నా. 'అడుగు.. అడుగు' పాట విని నేను చాలా ఉద్విగ్నానికి గురయ్యా అంటూ వ్యాఖ్యానించారు.
కాగా జార్జిరెడ్డిలో ఉన్నది, అప్పట్లో నేను విన్నది చూస్తే ఆయన ఎలాంటి ఆశయాలతో ఉండేవారు? ఏవిధంగా విప్లవకారుడిలా ఉండేవారు? అన్యాయం జరిగినా, అణచివేత జరిగినా, విద్యార్థి నాయకుడిగా జార్జిరెడ్డి ఎలా స్పందించేవారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారని తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఈతరం యువత 'జార్జిరెడ్డి'కు కనెక్ట్ అవుతారని, ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, చిత్ర బృందానికి ప్రత్యేకంగా నా అభినందనలు అని చిరంజీవి అన్నారు.
విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మిక్ మూవీస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్, త్రీ లైన్ సినిమాస్ పతాకంపై అప్పిరెడ్డి నిర్మించారు. సురేశ్ బొబ్బిలి, హర్షవర్థన్ రామేశ్వర్లు సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు యువతరాన్ని ఆకట్టుకుంటుందా ? లేదా అనేది చూడాలి.