గరుడవేగ చిత్రంతో తిరిగి ఫామ్లోకి వచ్చిన యాంగ్రీ హీరో డా. రాజశేఖర్ ఇటీవలె విడుదలైన 'కల్కి' చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన మరో చిత్రం తెరకెక్కబోతుంది. ఆ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారు. సీనియర్ నిర్మాత రమేశ్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో లాయర్ గా, ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన పాత్రలను ఆయన పోషించనున్నారు.
అంతేకాకుండా ఆయన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్ డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు ‘క్షణం’ ను శిబిరాజ్ తో ‘సత్య’గా తీయటంతో పాటు ‘బేతాళుడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరోయిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు.
సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకె చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. విభిన్నమైన పాత్రలతో మళ్ళీ దూసుకుపోతున్న రాజశేఖర్ ఆయన కూతుర్లకు మాత్రం ఎందుకో ఆఫర్లు రావడం లేదు.
ఇటీవలె రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద రాజశేఖర్ నా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కారులో ఆయన ఒక్కరే ఉండగా ఈ ఘటన జరిగింది.