ఎనభైల నాటి తారలంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్రతియేటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి పదో వార్షికోత్సవ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడమే గాక.. ఆయనే హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ - కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి కావడంతో ఘనంగా మెగాస్టార్ ఈ వేడుకల్ని స్వయంగా నిర్వహించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మోహన్లాల్ కనిపించారు. ‘నా అమేజింగ్ ఫ్రెండ్ చిరంజీవితో నేను’ అని ట్వీట్లో మోహన్ లాల్ పేర్కొన్నారు. ఈ ఫొటోలో చిరంజీవి కుర్చీలో కూర్చొని ఉండగా మోహన్ లాల్ ఆయన్ని వెనుక నుంచి ఆప్యాయంగా భుజాలపై నుంచి రెండు చేతులు వేసి పట్టుకున్నారు.
చిరంజీవి కొత్త ఇంటిలో జరిగిన తారల ఆత్మీయ కలయికలో వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్, సురేష్, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరుకాలేదు. ఆయన ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉండటంతో రాలేదట. మొత్తం మీద 37 మంది తారలు పాల్గొన్నారు. ఇక చిరంజీవి కొత్త ఇల్లంతా తారలు దిగివచ్చిన వేళ అన్నట్లు తారలతో చిరంజీవి ఇల్లంతా సందడిగా ఉంటుంది.