తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు ‘నందమూరి తారక రామారావు’. ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించి ప్రజలకు ఆరాధ్య నటుడయ్యారు. రాముడు, కృష్ణుడు పాత్రలకు ఆయన జీవం పోశారు. నవంబర్ 24 ఆయన నట జీవితంలో ఓ ముఖ్యమైన రోజు. 70ఏళ్ల క్రితం ఇదే రోజు ఆయన నటించిన ‘మన దేశం’ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన కథానాయికను సంతోషం సురేశ్ కలిసి అభినందించారు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఇందుకు సంబంధించిన ఫొటోస్ ను పోస్ట్ చేశారు.
‘మనదేశం’ సినిమా నిర్మాణ సారథికి సురేశ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సారధి, ఆ చిత్ర కథానాయిక కృష్ణవేణికి ‘సంతోషం’ పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. 1930-1940వ దశకంలోని కథానాయికల్లో ఇంకా జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. 96 ఏళ్ల వయసులోనూ ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ పతాకంపై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా ఉన్నారు. ఆమె రాజా గారి సతీమణి కూడా. ఈ సినిమా 1949 నవంబరు 24న విడుదలైంది. కృష్ణవేణి పాదాలకు సురేష్ కొండేటి నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. తాను సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో వారి ఇంట్లోనే పెరిగానన్నారు. ఆమె కుమార్తె ఎన్.ఆర్. అనురాధా దేవి నిర్మించిన కొన్ని చిత్రాలకు కూడా తను సహకారం అందించానన్నారు. వారి కుటుంబంతో తనకు ఉన్న ఆత్మీయానుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. ఆమె పూర్ణాయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు ఎనలేనివని సురేశ్ కొనియాడారు.