సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘చిత్రం’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు ఉదయ్ కిరణ్. చిన్న వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పడే కష్టాలు ఈ మూవీలో కళ్లకు కట్టినట్టు చూపించాడు తేజ. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన ఉదయ్ కిరణ్ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకున్నాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా మంచి క్రేజ్ సంపాదించాడు. ఉదయ్ కిరణ్ పుట్టింది..పెరిగింది హైదరాబాద్ లోనే.. కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. సినిమాలపై మోజుతో మోడలింగ్ చేస్తూ వచ్చాడు. తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు.
ఆ పై వచ్చిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే ’ కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.. 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన సినిమాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న నటుడు ఉదయ్ కిరణ్ కావడం విశేషం. వరుస విజయాలు అందుకుంటున్న ఉదయ్ కిరణ్ కి వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి.
కెరీర్ పూర్తిగా అయోమయంలో పడిపోయింది. అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. వరుస ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ మూవీ ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు. కానీ అవికూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
తారా జువ్వలా వెలిగిపోయిన ఉదయ్ కిరణ్ జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. దాంతో మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయ్ కిరణ్ మరణించి ఐదేళ్లు దాటినా అతని పేరు ఇంకా అభిమానుల గుండెల్లో మారుమోగుతూనే ఉంది. తాజాగా ఓ దర్శకుడు ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా చేయబోతున్నాడు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడు. ఉదయ్ పాత్రలో ఈయన కనిపించబోతున్నాడు. ఈ మూవీ జనవరిలో సెట్స్ పైకి రాబోతున్నట్లు తాజా సమాచారం.