తెలుగులో ప్రస్తుతం టాప్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఈ టాప్ ప్లేస్ లోకి మహేష్ రావడానికి గల కారణం పవన్ కళ్యాన్ సినిమాలు చేయకపోవడమే అనే వాదన కూడా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి అభిమానులు ఎక్కువ మంది ఉండేవారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకి దూరంగా ఉన్నారు. కానీ మళ్లీ హిందీ సినిమా అయిన పింక్ రీమేక్ తో మన ముందుకు వస్తున్నాడు.

 

అయితే ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం మహేష్ బాబు హవా నడుస్తుందనే చెప్పాలి. మొన్న వచ్చిన మహర్షి సినిమా మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు"చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ విడుదలయి ట్రెండింగ్ లోకి వచ్చింది.

 

విడుదలయిన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. దీంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మాస్ మసాలా చిత్రం కావడమే కాక, అనిల్ రావిపుడి కామెడీ కూడా జత కానుండడంతో సినిమా మాస్ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షిస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే మహేష్ అభిమానులు మాత్రం రికార్డు స్థాయిలో ఈ సినిమాకి ప్రచారం కల్పించే పనిలో పడ్డారు.

 

తాజాగా మహేష్ బాబు భారీ కటౌట్ హైదరాబాద్‌లోని సుదర్శన్ 35MM థియేటర్ ముందర ఉంచడం పలువురిని అబ్బురపరుస్తోంది. ఏకంగా 81 ఫీట్ల ఎత్తుతో అత్యంత భారీగా ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలకు ఇంకా నెలకు పైగా సమయం ఉండగానే ఈ రేంజ్ కటౌట్ ఏర్పాటు చేశారంటే ఆ సినిమాకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కటౌట్ ఫోటో ట్రెండింగ్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: