ఈ మధ్య కాలంలో వెండితెర, బుల్లి తెర నటీనటులు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం కామన్ అయిపోయింది. గతంలో కూడా చాలా మంది ఈ కేసులో పట్టుపడి జరిమానాలు కూడా చెల్లించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఈ కేసులో చిక్కుకోవడం తప్పలేదు.
తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినా తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించాడు హీరో ప్రిన్స్. నీకు నాకు డాష్ ఆష్ , బస్టాప్, రొమాన్స్ సినిమాలతో కాస్త ఫాంలోకి వచ్చాడు. ఈ నెల 24న మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బాచుపల్లిలో వీఎంఆర్ కాలేజ్ దగ్గర పట్టుబడ్డ ప్రిన్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ రోజు (మంగళవారం) కూకట్పల్లి కోర్టుకు హాజరయ్యాడు ప్రిన్స్. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రిన్స్కు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రిన్స్ జరిమానా చెల్లించి వెళ్లిపోయాడు.
సక్సెస్ సినిమాల్లో నటించినా ఆశించినంత పేరు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యి నేను శైలజ, మిస్టర్ లాంట సినిమాల్లో నటించాడు. నాని వ్యాఖ్యతగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టంట్గానూ కనిపించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం సిక్స్ పాక్ తో హల్ చల్ చేస్తున్నాడు. అయితే సెలబ్రెటీలయినా ఎవరైనా సరే రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తే కోర్టుకు ఎక్కడాలు, జరిమానాలు కట్టడాలు అన్నవి మాములేనని మరోసారి నిరూపించింది ఈ ఘటన. వీకెండ్ వచ్చిందంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా మందుబాబుల్లో మార్పు మాత్రం రావడంలేదు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా పోలీసుల ఆదేశాలను పట్టించుకోవడంలేదు.