''మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో దాదాపు సీనియర్స్, పేద కళాకారులకు తగిన ఫించను, మెడిక్లెయిమ్స్ వంటివి ఏర్పాటు చేశాం. నేను ఆ బాధ్యత తీసుకున్నా. నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అందరికీ న్యాయం చేస్తానని చెప్పాను. అలాగే చేస్తున్నాను. ఇప్పటికి 6నెలలపైగా అయింది. ఈమధ్య వచ్చిన కొన్ని సంఘటనలు అపార్థాలవల్లే వచ్చాయి. రెండు ప్యానల్స్గా పోటీచేసినప్పుడు భిన్నాభిప్రాయాలు వుండడం సహజం. ఏదైనా సమస్య వుంటే సినీపెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు నేను సిద్ధం. లేదంటే ఈరోజునుంచే నేను తప్పుకుంటాను. నేను సేవ చేయడానికి వచ్చా. ప్రమాణస్వీకారం రోజునే చెప్పాను. ఈ ఒక్క టర్మ్మాత్రమే సేవ చేస్తానని'' నరేష్ తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ సినిమా అసోసియేషన్లో చిన్నపాటి స్పర్ధలున్నాయి. ఇక్కడా వున్నాయి. దాన్ని సాల్వ్ చేసుకునేందుకు నా వంతు కృషి చేస్తా అని వెల్లడించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను స్థాపించిన పెద్దలు, ఆ తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎందరో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. వారి బాటలోనే నేను నడుస్తున్నా. నా కాలంలో ఎక్కువగా పేద కళాకారులకు తగిన న్యాయం చేయాలని ఆలోచనలో వున్నాను. అందరూ సహకరిస్తున్నారని తెలిపారు.
ఆ కౌగిలింతను మర్చిపోలేదు: నరేష్
''మా అమ్మ విజయ నిర్మలగారికి రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డ్ వచ్చినప్పుడు ఆయన విగ్రహం చూసి ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది. ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సినిమా కోసం ఆయన పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకున్నాను. వెంటనే దర్శకుడు బాబ్జికి చెప్పడం, మండవ సతీష్ నిర్మాతగా నేను చేస్తానని ముందుకు రావడంతో ఈ మూవీ కార్యరూపం దాల్చింది'' అని వెంకయ్య పాత్రధారి సీనియర్ నరేష్ తెలియజేశారు. ప్రస్తుతం 'ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా'గా పిలవబడే రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. బాబ్జి దర్శకత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్పై మండవసతీష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 29న ఈ చిత్రం విడులవబోతున్న సందర్భంగా నరేష్ చెప్పిన విశేషాలు.