ఎప్పుడూ ఏదో ఒక కొత్త వివాదంతో ట్రెండింగ్లో ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` ఈ చిత్రం మొదటి నుంచి వివాదాల పైనే నడుస్తుంది. వర్మ సినిమా రేపు విడదలనగా రాత్రికి రాత్రే పేరును మార్చిన విషయం కూడా తెలిసిందే. `లమ్మరాజ్యంలో కడపబిడ్డలు` అన్న పేరు పెట్టినా లోపల కంటెంట్ మాత్రం అలానే ఉంటుందని కొందరు ఈ చిత్రం విడుదలను అడ్డుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు (నవంబర్ 29న) విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాలేదు. దీనికి తోడు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. చిత్ర విడుదలకు వీలులేకుండా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది.
టైటిల్ విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమా టైటిల్ ఉందని, దాన్ని మార్చాలని సూచించింది. ఇదిలా ఉంటే, ఈ టైటిల్ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఒక లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్) సజ్జల రామకృష్ణారెడ్డి పేరిట ఈరోజు రీజినల్ సెన్సార్ బోర్డుకు ఒక లేఖ అందింది. చిత్ర టైటిల్ను మార్చాల్సిందిగా ఈ లేఖలో రీజినల్ సెన్సార్ ఆఫీసర్ను సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.
‘‘రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ చిత్ర టైటిల్, పోస్టర్లు రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు టెంపోను బిల్డప్ చేశాయి. టీజర్లు కూడా కలకలం సృష్టించాయి. ఆయన విడుదల చేసిన ఈ చిత్రంలో ప్రతి పాట కూడా వివాదాన్నే సృష్టించాయి. అయితే ఈ చిత్రంలోని పాత్రలు, కొన్ని సాంగ్స్ కొందరి మనోభావాలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. దీంతో ఈ చిత్ర విడుదలను అడ్డుకోవడం జరిగింది.