ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏవైనా వాటి పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించి, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని వల్ల ఎదుటి వారు సైతం ఇబ్బందులు పడటం..చనిపోవడం.. వికలాంగులుగా మారడం జరుగుతుంది. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తరచుగా రాజశేఖర్ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతుండగా.. ఆయన లైసెన్సును రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు.
ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. 2017 అక్టోబర్ 9న యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి పీవి ఎక్స్ ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని తన కారుతో ఢీకొట్టారు. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వలననే రాజశేఖర్ యాక్సిడెంట్ చేశాడని భాదితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. తల్లి చనిపోయిందనే డిప్రెషన్లో నిద్రమాత్రలు వేసుకోవడం వలన ఆ మత్తులో కారు యాక్సిడెంట్ చేశాడని అన్నారు.
రీసెంట్గా శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్పై నటుడు రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. సమయానికి బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. అదృష్టం కొద్ది ఆ సమయంలో వేరే వాహనాలు అటుగా రాకపోవడం వల్ల మరో ప్రమాదం తప్పింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఆయన ప్రయాణిస్తోన్న కారు మరో కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.