'బాహుబలి' బిగినింగ్, బాహుబలి కన్క్లూజన్ ఎంతగా తెలుగు సినిమా స్టామినాని ప్రపంచమంతా తెలిసేలా చేశాయో అందరికి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు ప్రభాస్ మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. అందుకే సాహో లాంటి పాన్ ఇండియా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సస్ ని సాధించలేకపోయింది. ఇక మెగాస్టార్ సైరా లాంటి సినిమాలు రావడానికి కూడా రాజమౌళి కారణం అని చెప్పక తప్పదు. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఊపు దక్షిణాది హీరోలలో ఎక్కువైపోయింది. ఎలాంటి సినిమా తీస్తే దేశమంతా ఎగబడి చూస్తుందనేది లెక్కలు వేసుకుని మరీ వందల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ అక్కడే కోట్లలో నష్టం జరిగిపోతోంది.
ఇంతవరకు బాహుబలి క్వాలిటీలో సగం కూడా అందించలేక చతికిల పడ్డ సినిమాలు సాహో సైరా లనే ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాలు ఆడాయనే కారణంగా అదే ట్రెండ్లో ఏళ్ల తరబడి ఒకే సినిమాపై వుండడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇష్టపడడం లేదు. ఇంతవరకు మహేష్ కి పాన్ ఇండియాకి సరిపడే కాన్సెప్ట్లంటూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తమ ఐడియాలు చెప్పారు కానీ మహేష్ ని మాత్రం ఒకే చేద్దాం అనిపించలేకపోయారు.
కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పినా కానీ తన తెలుగు మార్కెట్కి తగ్గ సినిమా చేయాలనే మహేష్ చెప్పాడు. ఏదో అద్భుతం చేసేయాలనే ఆరాటం తో తనపై తానే ఒత్తిడి పెంచుకోకుండా మహేష్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. మహేష్కి రెగ్యులర్ సినిమాలతోనే యాభై కోట్ల వరకు వస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాకి మహేష్ ఏడు నెలల సమయం మాత్రమే కేటాయించాడు. బాహుబలి లాంటి సినిమా చేసినా కానీ తనకి ఇంతకు మించి రెమ్యూనరేషన్ రాదు. అందుకేనేమో అనవసరమైన టైం వేస్ట్ ఎందుకని మహేష్ కూల్గా రెగ్యులర్ సినిమాలే చేసుకుంటు వెళుతున్నాడు. అయితే ఒకరకంగా చూస్తే ప్రభాస్ కి ఉన్న స్టామినా మహేష్ కి లేదా అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు.