టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ లో వచ్చిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి సినిమా తర్వాత ఒక చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమా కూడా రాలేదు. గత నాలుగు నెలలుగా ప్రతి వారం రెండు మూడు సినిమాలు థియేటర్ లోకి దిగుతున్న ఒక్కటి కూడా హిట్ అవలేదు. కొన్ని సినిమాలకు కనీసం పోస్టర్ల ఖర్చులు కూడా రాని దుస్థితి. మరికొన్ని సినిమాలకు శాటిలైట్ బిజినెస్ కూడా జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ యేడాది తెలుగు సినిమా పరిస్థితి హిట్లు తక్కువ...ఫ్లాపులు చాలా ఎక్కువ అన్నట్టుగా ఉంది.
ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 ఒక్కటే భారీ విజయాన్ని దక్కించుకుంది. ఎఫ్2 అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ రాబట్టింది. ఆ తరవాత వరుస పెట్టి ప్లాపుల మీద ప్లాపులు వచ్చాయి. సమ్మర్లో మహేష్బాబు మహర్షి సినిమా మాత్రం కాస్త ఊరట ఇచ్చింది. వంద కోట్లు కలెక్షన్ దాటింది. ఇక మహర్షి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగిన భారీ విజయాలు నమోదు కాలేదు. మధ్యలో రామ్ ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు మంచి వసూళ్లు రాబట్టినా భారీ బడ్జెట్ సినిమాలు అయిన సైరా, సాహో పూర్తిగా నిరాశ పరిచాయి. ఈ రెండు సినిమాల నష్టాలతో బయ్యర్లు కోలుకోవడానికి చాలా టైం పట్టక తప్పదు.
ఇక ఇటీవల తమిళ చిత్రాలే బెటర్ అనిపించాయి. విజిల్, ఖైదీ, యాక్షన్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. కానీ తెలుగు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయాయి. అయితే తెలుగు సినిమాలు హిట్ కాకపోవడానికి నాసిరకం కథలు ఎంచుకోవడమే ప్రధాన కారణం. మన వాళ్లు ముఖ్యంగా కథ మీద కాన్సంట్రేషన్ చేయకుండా బడ్జెట్ మీద దృష్టి పెట్టడంతో సినిమాలు వరుస పెట్టి డంకీలు కొడుతున్నాయి. ఏకంగా ఐదారు నెలలు రొటీన్ రొట్ట సినిమాలే రావడం వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఒక్క సరైన హిట్ కూడా పడలేదు.
ఇక టాలీవుడ్ ఆశలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల మీదే ఉన్నాయి. రూలర్, ప్రతి రోజు పండగే, సరిలేరు నీకెవ్వరు, దర్బార్, అల వైకుంఠపురంలో, ఎంత మంచివాడవురా, భీష్మ లాంటి సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏం చేస్తాయో ? చూడాలి.