మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్.. జబర్దస్త్, పటాస్ వంటి ఎన్నో కార్యక్రమాలు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న సంస్థ ఇది. ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద రెడ్డి దీని అధినేత. అయితే ఈ సంస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ నుంచి ఇటీవల ప్రముఖ నటుడు నాగబాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆ షో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆ షోలోని అనుభవాలు తన యూట్యూబ్ చానల్లో పంచుకుంటారు.

 

తాజాగా ఆయన తన వీడియోలో మల్లెమాల యాజమాన్యంపై షాకింగ్ ఆరోపణలు చేశారు. జబర్దస్త్ షోను దాని నిర్మాతలైన మల్లెమాల యూనిట్ లోని కొంతమంది మధ్యవర్తులు చెడగొట్టారని నాగబాబు అన్నారు. నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి జరిగిన విషయాలు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అది అనవసరమని పట్టించుకోలేదో ఏమిటో గాని మధ్యలో ఉన్న కొంతమంది కారణంగా జబర్దస్త్ తన ఉనికిని కోల్పోతోందని మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేశారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ పైకి ఏమి కనిపించకపోయినా నేను తెర వెనుక షో కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పటికి కూడా చాలా మంది ఫోన్ చేసి జబర్దస్త్ షోలో మీరు లేనందుకు చూడలేకపోతున్నాం, సార్ అంటూ ఫోన్ చేస్తున్నారు. నా వరకు నాతో అంతా బావుండేవారు.. బాగానే చూసుకున్నారు. కానీ చుట్టుపక్కల షో కోసం కష్టపడేవాళ్ళపై ట్రీట్మెంట్ దారుణంగా ఉండేది. షోలో ఉన్నవాళ్లకు ఏం జరిగినా తమకెందుకులే అని పట్టించుకునేవాళ్ళు కాదు.

 

గతంలో వేణు పై దాడి జారిగినప్పుడు కూడా మల్లెమాల నుంచి ఎవరు స్పందించలేదు. అప్పుడు నేనే ముందుకు వెళ్ళాను. చాలా మంది విషయాల్లో మల్లెమాల తీరు ఇలానే ఉండేది. వేణు - ధనరాజ్ అలాగే మరికొంతమంది షో నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా ఓ విధంగా ఇక్కడి మధ్యవర్తులే అని నాగబాబు వివరించారు. మల్లెమాల యాజమాన్యంపై ఆయన చేసిన తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: