టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాక తన వంతుగా ఇటీవల ఆంధ్ర మరియు తెలంగాణలోని ప్రాంతాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని తనవంతుగా కొన్నేళ్లుగా ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు చేస్తున్న విషయం తెలిసిందే. అలానే పలు సామజిక సేవ కార్యక్రమాలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్, మూడు రోజుల క్రితం అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురై, హత్య గావింపబడ్డ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఉదంతంపై నేడు ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ ఒక ఆడియోని రిలీజ్ చేసారు. ఎందరో అక్క, చెల్లెళ్లకు అన్నయ్యగా, అలానే ఒక ఆడబిడ్డకు తండ్రిగా ఉన్న తనకు, ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం వినగానే గుండె ఎంతో కలచి వేసిందని, ఇటువంటి దారుణాలు వింటుంటే మనం ఇటువంటి మృగాల మధ్యన బ్రతుకుతున్నామా అని ఎంతో ఆవేదన వ్యక్తం చేసారు. ఇక మహేష్ బాబు రిలీజ్ చేసిన ఆ ఆడియో టేప్ వింటే ప్రతిఒక్కరికి మనసు కలిచి వేస్తుంది.  

ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..

ఎవరి మాట మన్ననగా ఉంటుందో..

ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..

ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..

ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో..

ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో. వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..

ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు,ఉంటుంది, అలానే గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..

ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో, అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే నిజమైన మగాడు

అంటూ మహేష్ బాబు ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: