స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠ పురం లో సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై తెలుగు సినిమా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
బన్నీ ని వెండి తెరపై చూసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ఆయన నటించిన ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’ గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు బన్నీ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో ఉన్న త్రివిక్రమ్ సైతం తన మార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని కోణాలు కలిగిన ఫుల్ ప్యాక్డ్ స్టోరీ సిద్ధం చేశారట.
ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లకు పెద్ద పీట వేశాడట త్రివిక్రమ్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో మనసుకు హత్తుకునేలా ఉంటాయట. క్లైమాక్స్లో వచ్చే బన్నీ, మురళీ శర్మ, సీనియర్ హీరోయిన్ టబు నటనతో పాటు బన్నీ చెప్పే డైలాగులు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ ని బన్నీ నటన గుర్తు చేస్తుందట.
బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో నటిస్తుండడం ఈ సినిమాకు హైలెట్ కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.