సౌత్ ఇండియా సినిమా చరిత్రలో ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. తమిళ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టారు. లక్షల్లో టిక్ టాక్‌లు చేసి ఈ పాటను భారీ హిట్ చేశారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు.

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలో విడుదల చేసిన మొదటి పాట ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ‘సామజవరగమన’ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్, లక్షల్లో లైక్స్ సాధించింది. అయితే, ఈ పాటకు ఇప్పటి వరకు ఒక మిలియన్‌కు పైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా ఒక రికార్డే. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఏ తెలుగు సినిమా పాటకు ఇన్ని లైక్స్ రాలేదు.

 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చగా మూడోసారి ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం వీరిద్దరూ జతకట్టారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం హీరో, దర్శకుడితో పాటు చిత్ర నిర్మాణ సంస్థలు కూడా. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

 

సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటి టబు కీలక పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ఇతర పాత్రల్లో నటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: