పెళ్ళి చూపులు సినిమాతో తెరగేట్రం చేసిన భామ రీతూ వర్మ. అంతకుముందు లఘు చిత్రంలో నటించి అవార్డులు సైతం దక్కించుకున్న ఈ హీరోయిన్ కి తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఈ సినిమాలో ఆమె నటన హీరో స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. కథ హీరో చుట్టూ తిరిగినప్పటికీ హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆమె నటన విమర్శకులని మెప్పించింది.

 

అయితే ఈ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ హీరోయిన్ రీతూ వర్మ కి మాత్రం అవకాశాలు అనుకున్నంతగా రాలేదు. పెళ్ళి చూపులు తర్వాత ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ. కేశవ అనే సినిమాలో నటించిన తర్వాత మళ్ళి తెలుగులో కనిపించలేదు. కనిపించలేదనడం కంటే అవకాశాలు రాలేవనడం కరెక్టేమో!  దాంతో రీతూ వర్మ పరభాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళింది.

 

తమిళంలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన రీతూ, మళయాలంలో దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తుంది. ఈ సినిమా తెలుగులో కూడా అనువాదం అవుతుంది. అయితే ప్రస్తుతం రీతూ వర్మకి తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నాయి.శర్వానంద్‌తో ఒక బైలింగ్వల్‌ చేస్తోన్న రీతు వర్మ త్వరలో నాని సరసన నటించనుంది. నానితో 'మజిలీ' దర్శకుడు రూపొందించే చిత్రంలో ఒక కథానాయికగా ఆమె ఎంపికయింది. 

 

 

అలాగే నాగశౌర్యతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కించే చిత్రంలోను రీతు వర్మ కథానాయికగా ఖరారయింది. ప్రస్తుతం తెలుగులో ఈ రెండు చిత్రాల్లో ఆమె నటిస్తుంది.  నానితో చిత్రం చేస్తోంది కనుక ఇకపై ఆమెకి వరుసగా సినిమాలు రావడం గ్యారెంటీ. ముందు ముందు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతేగాక ఈ చిత్రాలు విజయవంతం అయితే ఆమెకి తెలుగులో ఆఫర్లు వెల్లువలా వస్తాయనడంలో సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: