ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు థమన్. గత మూడేళ్ళుగా థమన్ అందిస్తున్న సంగీతం శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహానుభావుడు, తొలిప్రేమ సినిమా నుండి అతను పూర్తిగా మారిపోయాడు. ఆ సినిమాలో పాటలు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇక అప్పటి నుండి థమన్ అదే దిశలో సాగిపోతూ వినసొంపైన బాణీలని అందిస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు.
మరి థమన్ ఇంతలా మారడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు థమన్ పాటల్లో అసలు మాటలు వినిపించకపోయేవి. కేవల బీట్ మాత్రమే వినిపించి మ్యూజిక్ సాహిత్యాన్ని డామినేట్ చేసేది. ఈ విషయంలో చాలా మంది థమన్ ని విమర్శించారు. కానీ అప్పట్లో థమన్ ఈ విమర్శలని పెద్దగా పట్టించుకోలేడనే చెప్పాలి. ఎందుకంటే ఈ విమర్శలు వచ్చిన తర్వాత కూడా థమన్ సంగీతం అలానే ఉంటూ వచ్చింది.
పెద్ద పెద్ద హీరోల సినిమాలకి పనిచేసినా కూడా థమన్ సంగీతంలో మార్పు రాలేదు. అందువల్ల అతని సంగీతానికి ప్రేక్షకుల్లో ఆదరణ తక్కువైంది. ఈ విషయం థమన్ గ్రహించినట్టున్నాడు. అందుకనే మహానుభావుడు సినిమా నుండి తనను తాను మార్చుకుంటూ వచ్చాడు. ఎక్కువగా మెలోడీ పాటలని అందిస్తూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మార్పుకి కారణమేంటో థమన్ ఒకానొక మీడియా సమావేశంలో చెప్పాడు.
సరైనోడు సినిమా మ్యూజికల్ హిట్ అయినప్పటికీ.. ఆ సినిమా తర్వాత తాను ఏడాది గ్యాప్ తీసుకుని తనను తాను మార్చుకోవాలని ఆలోచించినట్లు తమన్ చెప్పాడు. ఎలాంటి సినిమాలు చేయాలి.. ఎలాంటి పాటలు కంపోజ్ చేయాలనే విషయంలో తనలో తాను తర్జన భర్జనలు పడ్డానని.. అలాంటి సమయంలోనే మహానుభావుడు, తొలి ప్రేమ సినిమాలు కొత్త తరహా పాటలు అందించే స్కోప్ ఇచ్చాయని.. అక్కడి నుంచి ప్రతి సినిమాకు కొత్తగా ట్రై చేస్తూ వెళ్లానని.. ఈ ప్రయాణం చాలా బాగా అనిపిస్తోందని థమన్ తెలిపాడు.