వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో
రాజ్ తరుణ్..
'ఇద్దరి లోకం ఒకటే' తో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటించగా కృష్ణా తెరకెక్కించాడు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నేపథ్యం లో రానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం కేవలం 126నిమిషాల నిడివి తో డిసెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది. అయితే దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా అయినా ఈచిత్రానికి ఎలాంటి బజ్ రావడం లేదు. మరి ఈ చిత్రం రాజ్ తరుణ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది. ఈసినిమాను పూర్తి చేసిన తరువాత రాజ్ తరుణ్ డ్రీం గర్ల్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. బాలీవుడ్ లో ఇటీవల విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకున్న డ్రీం గర్ల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఇక ఈరీమేక్ లో రాజ్ తరుణ్ హీరో గా నటించనుండగా ఆలా ఎలా ఫేమ్ ఆవిష్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే గతంలో రాజ్ తరుణ్ -అవీష్ కలయికలో వచ్చిన లవర్ నిరాశపరిచింది. అయినా కూడా మరో సారి అవీష్ తో రిస్క్ చేస్తున్నాడు రాజ్ తరుణ్.