వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాకు అడ్డంకులు తొలిగాయి. "అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇంచ్చిది రివైజింగ్ కమిటి. సెన్సార్ బోర్డ్ కూడా సినిమాను చూసి సర్టిఫికేట్ ఇవ్వలేమనడంతో ఈయన రివైజింగ్ కమిటీని ఆశ్రయించాడు. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. కొన్ని కట్స్ ఇచ్చి ఈ సినిమాను విడుదల చేసుకోండి అంటూ వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ.
ఈ సినిమాకు 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అని టైటిల్ కూడా మార్చేసాడు దర్శకుడు వర్మ. తొలుత 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్ సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్ను వెంటనే మార్చారు. కొత్త టైటిల్ ప్రకటించినా కూడా కమ్మరాజ్యంలో.. అంటూనే ఫ్యాన్స్ వాడేస్తున్నారు.
అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలని సూచించింది.
ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. రివైజింగ్ కమిటీ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోమ్మని వర్మకు చెప్పడంతో అభిమానులు కూడా ఆసక్తిగా సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ కోసం సినిమా విడుదల కొత్త తేదీని కూడా ప్రకటించనున్నాడు.