స్టైలిష్స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అరవింద సమేత వీర రాఘవ లాంటి హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు.... అటు బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని.... వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ అవుతుందన్న భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూడు సినిమాలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. సామజ వర గమన సాంగ్ అయితే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి దక్షిణ భారతదేశ సినిమా చరిత్రలో ఏ సాంగ్ కు లేనంత హైప్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆదివారం ఉదయం రిలీజ్ కావాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహ్మద్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందడంతో ఈ టీజర్ అప్డేట్ను వాయిదా వేశారు.
ఈ టీజర్ అప్డేట్ వాయిదాకు గల కారణం తెలుపుతూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఆదివారం అల వైకుఠపురంలో టీజర్ సంబరాలు చేసుకుందామనుకున్న బన్నీ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే మళ్లీ ఈ సినిమా టీజర్పై గీతా ఆర్ట్స్ అప్డేట్ ఇచ్చింది. ఈ అప్డేట్ను సోమవారం ఉదయం 10 గంటలకు ఇస్తామని తెలిపింది. అలాగే అల్లు అర్జున్ అభిమానులకు సాయంత్రం మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ మ్యూజి క్ అందిస్తున్నారు.