మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మాత్రం ఆ రేంజ్ రీచ్ అవలేదు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సైరా సినిమాలో చిరంజీవి నటనకు మంచి పేరు వచ్చినా బాక్సాఫీస్ పరంగా చూస్తే కమర్షియల్గా లాభాలు రాకపోవడంతో చిరంజీవి తన 152 వ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఈ సినిమాతో కమర్షియల్ గానూ బ్లాక్బస్టర్ హిట్ కొట్టాలన్నదే మెగాస్టార్ ఆలోచన. కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డిసెంబర్ 26న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ కోకాపోటలోని మెగాస్టార్ ఫామ్ హౌస్ లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక మొదటి షెడ్యూల్ హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోనే కంప్లీట్గా షూట్ చేస్తారు.
రెండో షెడ్యూల్ అంతా రాజమండ్రి, రాజమండ్రిలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తారట. ఇప్పటికే కొరటాల బృందం రాజమండ్రి లొకేషన్లను ఫైనల్ చేశారట. ఇక ఈ రెండో షెడ్యూల్లో చిరంజీవి సహా కీలక నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథాంశం పై హింట్ బయటకు వచ్చేసింది. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా టచ్ చేస్తున్నారని... అలాగే కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ కూడా సినిమాలో హైలెట్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఒక బ్రాహ్మణుడు పాత్రలో చిరు నటిస్తున్నారని... చిరంజీవిది డ్యూయల్ రోల్ అని... రామ్చరణ్ కీలక పాత్రలో నటించే స్కోప్ ఉందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తానికి ఈ సినిమా కథలో బ్రాహ్మణులు, దేవాలయ భూములను కథాంశంగా చేసుకున్నారన్నమాట.