రామ్ గోపాల్ వర్మ సినిమా లేటైనా లేటెస్ట్ గా విడుదలకు సిద్దవుతోంది. ఈనెల 12న 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ దగ్గర బ్రేక్ పడినా, ఇప్పుడు సరైన సమయంలో సినిమా విడుదలవుతోందని సంబరపడిపోతున్నాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్  వర్మ. అసెంబ్లీ సమావేశాలు తన సినిమాకి మంచి పబ్లిసిటీగా మారే అవకాశముందని అందరితో చెప్పుకుంటు ఆనందపడుతున్నాడట. 

 

ఎలాగూ వైసీపీ నేతల్లో చాలామంది తొలిరోజు ఈ సినిమా చూస్తారు, రోజా లాంటి వాళ్లు చూసి ఊరుకుంటారా.. ఫలానా సినిమాలో ఫలానా "పప్పు సీన్" బాగుందంటూ కచ్చితంగా సభలో సెటైర్లు వేస్తారు. ఇక చూడాలి టీడీపీ వాళ్ల మొహాలు.. అటు సినిమా గురించి మాట్లాడలేక, ఇటు వీరి సెటైర్లు తట్టుకోలేక సతమతమైపోవడం పక్కా. అప్పుడు పరిస్థితి అటు మింగలేక ఇటు కక్కలేక మధ్యలో అన్నట్టు ఉంటుంది.

 

అయితే సినిమాలో టీడీపీతో పాటు, వైసీపీపై కూడా సెటైర్లు ఉన్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో ఏ రకంగా చూసిన  సినిమాపై సభలో చర్చ జరగడం మాత్రం అనివార్యమని అనిపిస్తోంది. అంటే ఒకరకంగా రామ్ గోపాల్ వర్మకు అప్పట్లో సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడం కూడా ఇప్పుడు వరంగా మారిందనే చెప్పాలి. అప్పుడు ఆగిపోయి, సరిగ్గా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న టైమ్ లో రిలీజ్ అవుతోంది. ఇదే మంచి ఛాన్స్ అని వర్మ అనుకుంటున్నారు. 

 

ట్రైలర్ లో చూపించిన దానికంటే గొప్పగా వర్మ సినిమాల్లో ఏమీ ఉండదని ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు రుజువు చేస్తున్నా.. ఓపెనింగ్స్ మాత్రం తగ్గడం లేదు. ఏమాత్రం సినిమా క్లిక్ అయినా రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లు, లేనివాళ్లు అందరూ సినిమాకి రావడం ఖాయం. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాల మధ్య ఈ పొలిటికల్ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ రావడం ఖాయం. ఇక వర్మ ఇప్పటికీ ప్రచారంతో క్రేజ్ పెంచుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: