మాటలతో వివాదాలు సృష్టించగలడు... తన సినిమాలతో సంచలనాలు సృష్టించగలడు...ట్విట్ లతో ప్రమోషన్లు చేసేస్తాడు.. ఆయనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటుకే ఎన్నో సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రాంగోపాల్ వర్మ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారమే రేపాడు . ఇప్పుడు తాజాగా మరో సంచలనానికి తెరలేపారు రాంగోపాల్ వర్మ. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో సంచలన సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ వివాదాల దర్శకుడు సినిమాని వివాదాలు చుట్టుముట్టాయి.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దానిపై విచారించిన హైకోర్టు సెన్సార్ బోర్డు వర్మ సినిమాని పరిశీలించి అభ్యంతరకర సీన్ల గురించి నివేదిక అందించాలని తెలిపింది.. అయితే సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి ఆశ్రయించాలని వర్మ కు సూచించింది . కమ్మ రాజ్యంలో కడప రెడ్లుగా ఉన్న సినిమా టైటిల్ ను అమ్మ రాజ్యం లో కడప బిడ్డలుగా వర్మ మార్చడంతో రివైజింగ్ కమిటీ నుంచి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది దీంతో వర్మ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది.
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కి తాము సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. దీంతో సెన్సార్ క్లియరెన్స్ లేని సినిమాకు విడుదల తేది ఎలా ప్రకటిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా సినిమా లో 12 అభ్యంతరకర దృశ్యాలు తొలగిస్తాను అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుకు తెలిపారు. అయితే సినిమాలో సన్నివేశాలు తొలగింపు పై ఏం నిర్ణయం తీసుకున్నారో ఆధారాలతో సహా రేపటి లోపు తెలియజేయాలని వర్మ, సెన్సార్ బోర్డులను ఆదేశించింది కోర్టు . ఈ నేపథ్యంలో మరోసారి వర్మ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.