గత కొన్ని రోజులుగా కేరళకి చెందిన ఆటగాడు సంజూ సాంసన్ ని జట్టులోకి తీసుకోవాలని ప్రేక్షకుల నుండి ఒత్తిడి వస్తుంది. పంత్ ఆటతీరు బాగాలేకున్నా అతడికి వరుసగా అవకాశాలిస్తూ ఉండటం సాంసన్ ని మాత్రం బెంచీకే పరిమితం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ సాంసన్ కి అవకాశం ఇవ్వకపోవడం అతని అభిమానులని తీవ్ర నిరాశలకి గురి చేస్తుంది.
వెస్టిండిస్ తో జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లోనైనా అతనికి అవకాశం వస్తుందని భావించారు. కానీ అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో సాంసన్ అభిమానులు టీమ్ మేనేజ్ మెంట్ పై చాలా కోపంతో ఉన్నారు. పంత్ సరిగ్గా ఆడకపోయినా కూడా అవకాశాలు ఇస్తూ పోవడం సరిగా లేదని, అతని స్థానంలో పంత్ కి అవకాశం ఇచ్చి చూడాలని, కనీసం ఒక్కసారైనా అవకాశం ఇస్తే అతని ప్రతిభ బయటపడుతుందని అంటున్నారు.
గౌతమ్ గంభీర్ కూడా సంజూ సాంసన్ కి అవకాశం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా సాంసన్ కి అండగా నిలుస్తున్నాడు. ‘శాంసన్ను తన సొంత మైదానంలో టీమిండియా తరుపున ఆడించే అవకాశం ఇస్తారని భావించాము. కానీ నిరాశే ఎదురైంది. శాంసన్కు ఉన్న అత్యంత ధైర్య సాహసాలు, ఓపికకు మేమందరం ఏంతో ప్రేరణ పొందుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.
మ్యాచ్ సందర్భంగా కూడా మైదానంలో శాంసన్.. శాంసన్ అంటూ లోకల్ ఫ్యాన్స్ గట్టిగా అరిచిన విషయం తెలిసిందే. గతంలో కూడా శశిథరూర్ ఈ విషయమై టీమ్ మేనేజ్ మెంట్ ని తప్పు బట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పటికైనా సాంసన్ కి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఒక్కసారి అవకాశం ఇస్తే అతనిలోని ప్రతిభ బయటపడుతుంది.