సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కు సిద్దం అయిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా విడుదలను కేఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ప్రస్తుతం పాల్ అమెరికాలో ఉన్నాడు. అక్కడ నుండే సోషల్ మీడియా ద్వారా రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇప్పటికే వర్మపై కేసు పెట్టిన పాల్ త్వరలో వర్మ అరెస్ట్ అవుతాడంటూ కామెంట్ చేశాడు. ఇటీవల ప్రణబ్ ముఖర్జీ ఫొటోను వర్మ మార్ఫింగ్ చేసి తన ఫొటోను పెట్టుకున్నాడని సినిమా ప్రమోషన్ కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు.. అంటూ పాల్ ఆరోపించాడు.

 

అంతేకాదు పాల్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో జీవిత రాజశేఖర్ పై కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడ నేను ట్రంప్ ఇంపీచ్ మెంట్ హియరింగ్ లో బిజీగా ఉన్నాను. నా సమయాన్ని వృదా చేయాలనే ఉద్దేశ్యంతో వర్మ పిచ్చి పచ్చి పనులు చేస్తున్నాడు. సినిమా గురించి ఇంటర్వ్యూ కావాలంటూ మీడియా వారు నన్ను పదే పదే కోరుతున్నారు. అందుకే ఈ వీడియోను చేస్తున్నాను. వర్మపై ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యింది. తెలంగాణ పోలీసులు ఏ ఒక్కరిని వదలరు.

నా గురించి అభ్యంతరకర సీన్స్ ఉన్నాయంటూ కోర్టుకు వెళ్లగా అక్కడ నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వాటిని పూర్తిగా తొలగించిన తర్వాతే సినిమా విడుదల చేయాల్సి ఉంది. కాని వర్మ మాత్రం రివ్యూ సెన్సార్ కమిటీ ముందుకు వెళ్లి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా వైకాపాకు అనుకూలంగా తెరకెక్కిన విషయం తెల్సిందే. రివ్యూ సెన్సార్ కమిటీలో ఉన్నది జీవిత రాజశేఖర్ అనే విషయం తెల్సిందే. జీవిత రాజశేఖర్ లంచం తీసుకుని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందంటూ పాల్ ఆరోపించాడు. గతంలో జీవిత ఒక సినిమా విషయమై నా వద్ద 20 లక్షలు తీసుకున్నారు. వాటిని తిరిగి ఇవ్వలేదు. ఆమెపై జాలితో వదిలేశాను...అన్నాడు.

 

అంతేకాదు జీవిత వైకాపాలో ఉన్నప్పుడు ఎలా రివ్యూ సెన్సార్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతారంటూ పాల్ ప్రశ్నించాడు. వర్మ అరెస్ట్ అయ్యే రోజు చాలా తొందరగా రాబోతుందని పాల్ హెచ్చరించాడు. తనను అవమానించే విధంగా ఉండే సీన్స్ విషయంలో నేను చాలా సీరియస్ గా ఉన్నానంటూ పాల్ చెప్పుకొచ్చాడు. ఇలానే వర్మ పై ఇంకా పలు ఆరోపణలను చేశాడు. పాల్ ఆరోపణలపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అయితే కొంతమంది మాత్రం పాల్ మాటలు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మాటల్లా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: