త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయన సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో కూడా తెలుసు. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ చాలా మంది నటులు క్యూలో ఉంటారు. దర్శకుడిగా అతడు సినిమా నుంచి త్రివిక్రమ్ కు బాగా కలిసి వచ్చింది. రైటర్ గా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా త్రివిక్రమ్ బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ టాప్ దర్శకుడు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.
ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు అల వైకుంఠపురంలో ఇలా అన్ని సినిమాలు ఒక కుటుంబం నేపథ్యంలోనే ఉంటున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో అత్తను తిరిగి తీసుకెళ్లడానికి అల్లుడు పడే తపన గురించి తీసిన సినిమా. అందులో కూడా అత్త ఇంటికి వస్తాడు. అలానే, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా కాగితాల కోసం దేవరాజ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఏం చేసాడు అన్నది కథ.
ఆ తరువాత ఇప్పుడు వైకుంఠపురం అనే ఇంటికి వెళ్లి అక్కడ బన్ని ఏం చేశాడు అన్నది కథ. సెంటిమెంట్ తో పాటుగా సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తప్పనిసరిగా ఉంటాయని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు వస్తున్న మూడో సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అంటున్నారు సినీ పండితులు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. అక్కినేని హీరో సుశాంత్, నివేత పెతురాజ్, టబు, జయరాం తదితరులు ఇందులో నటిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.