కొంతకాలంగా వెంకటేశ్ మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఆ మధ్య కాలంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం వెంకటేశ్కు మంచి హిట్ అందించింది. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవితంలో మామ అల్లుళ్లలైన వెంకటేశ్, చైతన్య వెండితెరపై కూడా అదే పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజున ఈ సినిమా విడుదలకానుంది. మరియు ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా పాయల్ నటించగా.. నాగచైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.
అలాగే వెంకటేశ్ ఇందులో రైతు పాత్రలో నటిస్తుంటే.. చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరు హీరోల అభిమానాలు, ప్రేక్షకులు ఎంతో అసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన 'అసురన్' రీమేక్ లో చేయనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఖ్యా పరంగా ప్రాధాన్యతను సంతరించుకున్న వెంకటేశ్ 75వ సినిమాను గురించి అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే ఇంతకుముందు తరుణ్ భాస్కర్ వినిపించిన ఒక కథకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందువలన ఆయన 75వ సినిమా తరుణ్ భాస్కర్ తోనే ఉండొచ్చునని కొందరు అంటున్నారు. మరోవైపు.. 'సరిలేరు నీకెవ్వరు' తరువాత అనిల్ రావిపూడి వెంకటేశ్ తో 'ఎఫ్ 3' చేయాలనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ కారణంగా తన 75వ సినిమాను ఆయనతో చేయడానికే వెంకటేశ్ మొగ్గుచూపుతున్నాడని మరికొందరు అంటున్నారు. ఇలా వెంకటేశ్ 75వ సినిమాపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేశ్ వెంకీమామ చిత్రం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు.