ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన290కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితా నందిపురస్కారాలు అందుకున్నారు. మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం లభించింది.
గొల్లపూడి జీవన ప్రయాణం ఇలా ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్) పూర్తి చేసిన ఆయన మొదట్లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు.విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం వందేమాతరంని రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా, వచ్చిన 50 వేలు రూపాయల నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం మన దురదృష్టం అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేసారు.