ఎట్టకేలకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పలు చిత్రాల నిర్మాణాలకు లైన్ క్లియర్ అయ్యాయి. క్వీన్కు ప్రముఖ నటి రమ్యకృష్ణ , తలైవికి నటి కంగనా రనౌత్ , ది ఐరన్ లేడీ నిత్యా మీనన్ చిత్రాలకు ఆటంకాలు తొలిగిపోయాయి. వీటి నిర్మాణాలను నిర్భయంగా జరుపుకోవచ్చు. అందుకు మద్రాసు హైకోర్టు స్వయంగా పచ్చజెండా ఊపింది.
జయలలిత బయోపిక్ను దర్శకుడు విజయ్... తలైవి పేరుతో నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం, అందులో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా దీ ఐరన్ లేడీ పేరుతో చిత్రాన్ని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నటి నిత్యామీనన్ అందులో జయలలితగా నటించనున్న సంగతి విదితమే. ఇకపోతే జయలలిత జీవిత చరిత్రను దర్శకుడు గౌతమ్ మీనన్ టైటిల్ పాత్రలో నటి రమ్యకృష్ణ క్వీన్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. కాగా జయలలిత సోదరుడి కుమార్తె దీప వీటిని తన అనుమతి లేకుండా రూపొందించడాన్ని నిషేధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒకసారి ఈ పిటిషన్పై విచారణ జరిగింది. దీప పిటిషన్కు సమాధానం ఇస్తూ పిటిషన్ను దాఖలు చేయాల్సిందిగా దర్శకుడు గౌతమ్మీనన్కు, విజయ్కు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ విషయంపై హైకోర్టు లో గురువారం న్యాయమూర్తులు సెంథిల్కుమార్, రామమూర్తిల సమక్షంలో విచారణకు వచ్చింది. ఇందులో ఇరు తరఫు వాదనలు విన్న న్యాయమూర్తులు చర్చించి ధికి ఒక సంచలనమైన తీర్పును ఇచ్చారు ఏమిటంటే జయలలిత బయోపిక్ను చిత్రాలుగా తెరకెక్కించడాన్ని నిషేధించలేం అని తీర్పునిచ్చారు. అయితే దర్శక నిర్మాతలు ఇది కల్పిత సన్నివేశాలతో రూపొందించినట్లు టైటిల్ కార్డులో ప్రకటించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే పూర్తి అయిన రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ క్వీన్ శనివారం నుంచి ఆన్లైన్లో ప్రసారం కానుంది.