‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఒక సెటైరికల్ మూవీ అని నేను ముందునుంచి నుంచీ చెబుతున్నప్పటికి కొంత మంది ఉద్దేశపూర్వకంగా సినిమాను అడ్డుకున్నారని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. సినిమా రెండు వారాలు ఆలస్యంగా విడుదల కావడం వల్ల మేము చాలా నష్టపోయామని ఆవేదన చెందారు. సినిమాను అడ్డుకుని తమకు నష్టం వచ్చేలా చేసిన ఆ ఆరుగురిపై కనీసం రూ.20 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని వర్మ వెల్లడించారు. ఈనెల 12న విడుదలైన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆదివారం మీడియా తో మాట్లాడారు. చైనా నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన వర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

 

ఈ సినిమాలో ఎలాంటి వివాదాస్పద కంటెంట్ లేకపోయినా ఇది రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని, విడుదలైతే శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని కొంత మంది కావాలని దుష్ప్రచారం చేసి సినిమా విడుదలకాకుండా చేశారని మండిపడ్డారు. తమ సినిమాపై టీవీ ఛానెళ్లలో డిబేట్‌లు పెట్టి దుష్ప్రచారం చేసిన ఇంద్రసేన చౌదరితో పాటు కేసులు పెట్టి సినిమా విడుదలను ఆలస్యం చేసిన కేఏ పాల్ సహా మరో నలుగురుపై పరువు నష్టం దావా వేస్తామని వర్మ వెల్లడించారు. ఈ ఆరుగురిలో సెన్సార్ ఆఫీసర్ జ్యోతి కూడా ఉన్నారని వర్మ స్పష్టం చేశారు. అయితే, మిగిలిన ముగ్గురు ఎవరో వెల్లడించలేదు. మొత్తం మీద తమ సినిమాకు నష్టం చేకూర్చిన వారిని అయితే వదిలే ప్రసక్తే లేదని వర్మ తేల్చేశారు.  

 

సినిమా సెన్సార్ కాకుండా ఉండటానికి కొంత మంది సెన్సార్ ఆఫీసర్‌కు రూ.50 లక్షలు లంచం ఇచ్చారని నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అది నిజమేనని నట్టి కుమార్ మరోసారి తెలిపారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆధారాలు లేకుండా తాను ఆరోపణలు చేయనని క్లారిటి ఇచ్చారు. ఒక మనిషిని మార్ఫ్ చేస్తే కేఏ పాల్ అవుతాడని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై దుమ్మెత్తి పోసిన కేఏ పాల్.. ఇప్పుడు ఆయన్ని అంటుంటే నన్ను అవమానపరిచారంటూ గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. ఇంతకన్నా జోక్ ఇంకోటి ఉంటుందా అని వర్మ సూటిగా పాల్ ని ప్రశ్నించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: