తమిళ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. రఘువరన్ బిటెక్ సినిమా నుండి ధనుష్ సినిమాలు రెగ్యులర్ గా విడుదల అవుతున్నాయి. రఘువరన్ బిటెక్ తెలుగులో బాగా ఆడడంతో ధనుష్ కి తెలుగులోనూ ఓ మోస్తారు మార్కెట్ ఏర్పడింది. దాంతో ఆయన సినిమాలు తెలుగులో విడుదల చేయడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు మక్కువ చూపుతున్నారు. అయితే ప్రస్తుతం ధనుష్ మరో చిత్రం తెలుగులో విడుదలకి సిద్ధం అవుతోంది.

 


గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఎన్నై నొక్కి పాయుం తోటా" సినిమా తెలుగులో విడుదలకి సిద్ధమైంది. ఎన్నో అవాంతరాల మధ్య తమిళంలో విడుదల అయిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకి ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి చివరికి రిలీజైంది. అయితే సినిమా విడుదల ఆలస్యం అవడంతో ధనుష్ కి గౌతమ్ మీనన్ కి మధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చాయన్న టాక్ వినపడింది.

 

దానివల్లే సినిమా ప్రమోషన్లకి ధనుష్ రాలేడన్న టాక్ కూడా వినిపించింది. ఏదైతేనేం చివరికి సినిమా రిలీజైంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ తెరెకెక్కిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘తూటా’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ వెర్షన్ ను విజయభేరి సంస్థ ద్వారా తాతా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి విడుదల చేస్తున్నారు. 

 

ఇన్ని రోజులు సరైన రిలీజ్ డేట్ కోసం వెతికిన నిర్మాతలు ఎట్టకేలకు డిసెంబర్ 27వ తేదీని నిర్ణయించారు. ఎందుకంటే ఆరోజు మరే తెలుగు సినిమా విడుదలలేదు. కాబట్టి ఆరోజైతే మెరుగైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి తమిళ ప్రేక్షకుల వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల వద్ద ఎలాంటి మార్కులు వేయించుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: