సాధారణంగా సినిమాకు హీరో- హీరోయిన్ల పాత్ర ఎంత అవసరమో విలన్ పాత్ర అంతే అవసరం. అసలు సినిమాలో విలన్ పాత్ర లేకుంటే హీరోకి వెల్యూనే ఉండదని చెప్పాలి. మరి విలన్ పాత్ర చేయడానికి కూడా కూసంత కళాపోషణ ఉండాలి మరి. అయితే టాలీవుడ్లో కొందరు విలన్ రోల్లో చేసి హీరోగా చేసినవారు ఉన్నారు.. హీరోగా నటించి విలన్ పాత్రలు చేసిన వారు ఉన్నాయి. ఏదేమైనా విలన్కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన విలన్లు ఇప్పుడు కనుమరుగైపోయారు.
అందులో ముఖ్యంగా.. ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి. ఈయన ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్. రెడ్డికి సమీప బంధువు. ఇక 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో, డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం "అంకుశం" ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి విలన్ గా ప్రవేశించిన రామిరెడ్డి అనంతరం 250 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. వాస్తవానికి అంకుశం చిత్రంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగి పోయి ఆ తర్వాత పలు చిత్రాలలో ఆయన ప్రధాన ప్రతి నాయకుడి పాత్రను పోషించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
తెలుగులో గాయం, ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు వంటి చిత్రాలు ఆయనకు విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన ఆఖరి చిత్రం మర్మం. అయితే కిడ్నీ వ్యాధితో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఏప్రెల్ 14 వ తేదీన కన్నుమూశారు. ఇక మరో విలన్ కమ్ హీరో రియల్ స్టార్ శ్రీహరి. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు.
అయితే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే హఠాత్తుగా అనారోగ్యంతో మరణించారు. వాస్తవానికి శ్రీహరి కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రంలో ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాడు. విలన్ నుంచి హీరోగా టాప్ రేంజ్కు ఎదిగాడు శ్రీహరి. ఈ క్రమంలోనే మంచి పాత్రలు చేస్తూ ఓ వెలుగు వెలుగుతోన్న దశలో దురదృష్టవశాత్తు ఆయన మన్నుంచి దూరంగా, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు.