సినీ కథారచయిత చిన్నికృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది. 'నరసింహనాయుడు', 'ఇంద్ర', 'గంగోత్రి', 'బద్రీనాథ్' వంటి సినిమాలతో చిన్నికృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యారు. అలాగే, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన చిన్నికృష్ణ.. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మెగా అభిమానుల ఆగ్రహానికి లోనయ్యారు. అయితే చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాతగా మారి జనాల ముందు ప్రత్యక్షమయ్యారు. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌ని స్థాపించి తన కుమారులు చిరంజీవి సాయి, బద్రీనాథ్‌లను నిర్మాతలుగా పరిచయం చేస్తున్నట్టు సోమవారం మీడియా సమావేశం ద్వారా ప్రకటించారు. 

 

అంతేకాకుండా తన బ్యానర్‌లో మొదటిచిత్రంగా 'కింగ్ ఫిషర్'ను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంచింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్రప్రసాద్, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ పాల్గొన్నారు. 'సినిమాల మీద ఆసక్తితో తెనాలి నుంచి చెన్నపట్నం వెళ్లి భాగ్యరాజా దగ్గర రచయితగా పని చేశాను. సుజాత రంగరాజన్‌కి ఏకలవ్య శిష్యుడిగా రచనలో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత పరచూరి సోదరులు, బి.గోపాల్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. మా చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నటీనటులకు టెక్నీషియన్స్‌కి కుల, మతాలకు అతీతంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా సినిమాలు రూపొందించాలని పక్కాప్రణాళికతో మొదటి సినిమాగా 'కింగ్ ఫిషర్' తో మొదలు పెట్టాం.

 

ఈ సినిమాకి అత్యంత ప్రతిభ గల ఓ యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. 'కింగ్ ఫిషర్' అనేది మల్టిఫుల్ కలర్‌లో ఉన్న ఒకరకమైన పక్షి పేరు. జనరల్‌గా కింగ్ ఫిషర్ అనగానే మత్తు, గ్యాస్ ఫిల్ చేసి కలిపి బాటిల్లో పోస్తే బీర్ అవుతుంది. అది తాగితే కిక్ ఇస్తుంది. మా 'కింగ్ ఫిషర్' మత్తుని వదిలిస్తుంది. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో మందిని చూసాను. నన్ను మోసపుచ్చిన వారిని, ఇతరులని మోసగించిన వారిని అందర్నీ పరిశీలించాను. వారి మానత్వాన్ని, హ్యూమన్ రిలేషన్స్‌ని ఒక బాటిలో పొందుపరిచాను. అదే ఈ 'కింగ్ ఫిషర్'. మోసగించే వాళ్ళ మత్తుని వదిలించి సమాజంలో మంచి మనుషులుగా మారుస్తుంది...అన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: