కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘దర్బార్’. ఈ సినిమా ట్రైలర్ను సోమవారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ముంబైలో సోమవారం సాయంత్రం హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్, విలన్గా నటించిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ ఆసక్తికర విషయాలు వెల్లడించాఎరు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ‘‘నిజానికి పోలీస్ పాత్రలు చేయడం నాకు ఇష్టముండదు. ఎందుకంటే ఈ పాత్ర చేసేటప్పుడు చాలా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి. నాకు చాలా సులభంగా చేసే పాత్రలంటే ఇష్టం. కానీ, ఏఆర్ మురుగదాస్ ఒక వైవిధ్యమైన కథతో నా దగ్గరకు వచ్చారు. ఇది రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్ కాదు. చాలా డిఫ్రెంట్గా ఉంటుంది. అతని విజువలైజేషన్, ఇమేజినేషన్ చాలా డిఫరెంట్’’ అని రజినీ తెలిపారు.
తలైవాగా కోట్లాది తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రజినీకాంత్.. ఇప్పటి వరకు తన డ్రీమ్ రోల్ను మాత్రం చేయలేకపోయానని అన్నారు. ‘‘నేను ఇప్పటి వరకు ప్రతి జోనర్లోనూ నటించాను. 160 సినిమాలు చేశాను. సుమారు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కానీ, ఇప్పటికీ నా డ్రీమ్ రోల్ను చేయలేకపోయాను. వెండితెరపై ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించాలన్నది నా కోరిక’’ అని చెప్పి రజినీకాంత్ షాకిచ్చారు. తలైవా సినిమా టైటిల్స్ ప్రారంభం కావడానికి ముందు ‘సూపర్ స్టార్ రజినీ’ అని వెండితెరపై అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో వస్తుంది. అయితే, తనను సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తున్నారో ఇప్పటికీ తనకు తెలీదని అన్నారు రజినీ.
‘‘సుమారు 40 ఏళ్ల క్రితం. 1980 ప్రారంభంలో అనుకుంటా నేను నా సినిమాను థియేటర్లో చూస్తున్నాను. పేర్లు వస్తున్నాయి. తెరపై ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ అని వచ్చింది. వెంటనే నిర్మాతను పిలిచి నన్ను అడగకుండా నా పేరు ముందు అలా ఎందుకు పెట్టారు అని ప్రశ్నించాను. సమాధానం లేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ అదే ఫీల్లో ఉన్నాను. అసలు నేను సూపర్ స్టార్ ఎలా అయ్యానో నాకే తెలీదు’’ అని ఆసక్తికరమైన విషయాలను రజినీ వెల్లడించారు.