డిజిటల్ సంచలనాలకు తెరతీస్తున్న తరుణంలో సరికొత్త అవకాశాలకు తెరతీసిన ఈ ట్రెండ్ లో ఫ్యామిలీ హీరోలకు అది పెద్ద ప్లస్ కానుందా..! అంటే అవుననే చెప్పుకుంటున్నారు. ఫ్యామిలీ హీరోలంతా ఓటీటీ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసే అవకాశం బాగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఓటీటీ వేదిక. సినిమాకు సమాంతరంగా డిజిటల్ స్ట్రీమింగ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. స్మార్ట్ ఫోన్ వాడకం .. వీడియో స్ట్రీమింగ్ కంపెనీల రాకతో అంతా మారిపోయింది. మొబైల్ లోనే సర్వస్వం. అక్కడ పూర్తి వినోదాన్ని అందించేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికాకు చెందిన నెట్ఫ్లిక్స్.. అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పటికే ఇండియా డిజిటల్ మార్కెట్ ని దాదాపుగా ఆక్రమించేశాయి. మరి కొన్ని సంస్థలు భారీ పెట్టుబడులతో ఈ మార్కెట్ లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

 

త్వరలో భారతీయ డిజిటల్ మార్కెట్లోకి ప్రఖ్యాత డిస్నీ సంస్థతో పాటు ఆపిల్ కూడా ప్రవేశిస్తోంది. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. ఈ తరుణంలో టాలీవుడ్ బడా నిర్మాతలు ప్రత్యేకంగా తమ సినిమాలు.. వెబ్ సిరీస్ ల కోసమే ఓ డిజిటిల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళలో టాలీవుడ్ అగ్ర నిర్మాత.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మొదటి అడుగు వేశారు. అల్లు శిరీష్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ ఓటీటీ వేదికను నడుపనున్నారు. 

 

అయితే ఇది కేవలం బాస్ అరవింద్ వరకే పరిమితమా? అంటే... ఈ కోణంలో టాలీవుడ్ కి చెందిన దిగ్గజాలు ఆలోచించే అవకాశం ఉందన్న మాటా వినిపిస్తోంది. ప్రతి పెద్ద నిర్మాణ సంస్థకు సొంత హీరోలు ఉన్నారు. అగ్ర నిర్మాతల్లో డి. సురేష్ బాబు- దిల్ రాజు- డివివి దానయ్య వంటి పెద్ద నిర్మాతలు ఈ దిశగా ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఇందులో స్టార్ హీరోల ప్రమేయం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బాలీవుడ్ లో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సొంత ఓటీటీ వేదికకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ హీరోలు అక్కడ కార్పొరెట్ టై అప్ తో ఓటీటీ వేదికపై నటిస్తున్నారు.

 

అయితే ఇలాంటి ప్రయత్నం టాలీవుడ్ లో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. మెగా ఫ్యామిలీలో హీరోల లిస్ట్ పెద్దదే. సినిమాలతో పాటు ఓటీటీ వేదికలపైనా నటించేందుకు స్కోప్ ఉన్నా.. ఆ కాంపౌండ్ నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సంబంధించి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అక్కినేని...ఘట్టమనేని... మంచు కాంపౌండ్ హీరోల్లో కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదు. వీరంతా ఓటీటీ పై ఆసక్తిగా లేరా? లేదా ఆ అవసరం మనకు రాదు అని అనాసక్తిగా ఉన్నారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశన్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: