టాలీవుడ్ లోకి సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన అలీ అంచెలంచెలుగా పైకి ఎదిగి స్టార్ కమెడియన్ అయ్యారు.  కమెడియన్ గానే కాకుండా పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.  హీరోగా నటించిన అలీ హీరో పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కామెడీతో అలరించారు.  గత కొంత కాలంగా పలు సినీ ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  అంతే కాదు టివి యాంకర్ గా తనదైన మార్క్ చాటుకుంటున్నారు అలీ.  తాజాగా అలీ ఇంట విషాదం చోటు చేసుకుంది.. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో నిన్న రాత్రి 11.41 నిమిషాలకి రాజమహేంద్రవరంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సామాన్య కుటుంబం నుంచి సెలబ్రెటీ స్థాయికి ఎదిగిన అలీ వెంట ఆయన తల్లిగారి ప్రోత్సాహం ఎంతో ఉందని పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.   

 

ప్రస్తుతం రాంచీలో షూటింగ్ లో ఉన్న అలీ తల్లి మరణ వార్త వినగానే హుటా హుటిన రాజమహేంద్రవరం చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ కి తన ఇంటికి తీసుకు వచ్చారు.  అలీ తల్లిగారి మరణ వార్త వినగానే టాలీవుడ్ లో పలువురు సెలబ్రెటీలు ఆయనను పరామర్శిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అలీ ఇంటికి వెళ్లి జైతున్‌కి నివాళులు అర్పించారు. అలీ కుటుంబానికి ధైర్యం అందించారు. 

 

అలీ చిన్ననాటి నుంచి నటుడుగా ఈ స్థాయికి రావడానికి ఆయన తల్లిగారు ఎంతో కృషి చేశారని.. ఆమె ఇచ్చిన ధైర్యమే అలీని ఇంత మంచినటుడిగా ఎదిగేలా చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు.  చిరంజీవితో పాటు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలువురు సినీ నటులు అలీని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: